అమరావతి భూ అక్రమాలపై దూకుడు పెంచిన సీఐడీ

సాక్షి, అనంతపురం :  అమరావతిలో భూ అక్రమాల వ్యవహారంపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది.  టీడీపీ నేతల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై దర్యాప్తు వేగవంతం చేసిన సీఐడీ అధికారులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల చిట్టా తవ్వుతున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కనగానపల్లి తహశీల్దార్‌ కార్యాలయంపై మంగళవారం సీఐడీ అధికారులు దాడులు నిర్వహించారు. అమరావతిలో భూములు కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌ కార్డుదారుల వివరాలు సేకరించారు.







 


అమరావతిలో మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు కనగానపల్లి వాసులు జయచంద్రచౌదరి, నిర్మలా చౌదరి భూములు కొనుగోలు చేశారు. తెల్ల రేషన్‌ కార్డుదారులు కోట్ల విలువైన భూములు ఎలా కొనుగోలు చేశారన్న విషయంపై వివరాలు సేకరించారు. మాజీ మంత్రి పరిటాల సునీత ప్రోద్బలంతో కొనుగోలు చేశారా లేదా ఇతర వ్యక్తుల బినామీగా ఉన్నారా? అన్న వివరాలపై సీఐడీ ఆరా తీసింది. 


కాగా, అమరావతిలో 4వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా కేబినెట్‌ సబ్‌కమిటీ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగా భూములు కొనుగోలు చేసిన రాజకీయ నాయకులపై సీఐడీ విచారణ చేస్తోంది.